అశ్వారావుపేట నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాల ప్రారంభం

★ రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ★ తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ – భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ప్రకృతి సహజ వ్యవసాయ విధానాల అమలుకు అశ్వారావుపేటను కేంద్రంగా చేసుకొని శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ, సహకార మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు మేళా, టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష–ఆయిల్‌పామ్ పత్రాల సమగ్ర పరిశీలనా ప్రయోగశాల, నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు, రూ.5 కోట్లతో బాలికల వసతి గృహ నిర్మాణం, రూ.3 కోట్లతో 3 కిలోమీటర్ల బీటీ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, ఆధునిక సాంకేతిక సేద్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ సామగ్రితో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను మంత్రులు పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం రైతు మేళాలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ మంజూరుతో సుమారు 35 సంవత్సరాల క్రితం స్థాపించిన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల దేశ విదేశాల్లో నిపుణులను తయారు చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిందన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ కళాశాల కంటే మిన్నగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ పంట వేసినా పండించే సామర్థ్యం ఉన్న రైతులు ఉన్నారని ప్రశంసించారు. ఆయిల్‌పామ్ సాగులో కోకో, మిరియాలు, జాజి వంటి అనుబంధ పంటలను కూడా రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారని తెలిపారు. గిరిజన రైతులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో గోదావరి జలాలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే ఆధునిక పంటలను సాగు చేసి జిల్లా తెలంగాణకే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారని, చిన్న, సన్నకారు, గిరిజన, బీసీ రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చొరవతో 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 2047 నాటికి వ్యవసాయ రంగం ద్వారా 400 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం రెండూ రైతులకు అత్యంత ఉపయోగకరమైన పథకాలన్నారు. గతంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాలను పునఃప్రారంభించి 50 శాతం సబ్సిడీతో రైతులకు యంత్ర పరికరాలు అందించడం శుభపరిణామమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.31 లక్షల మంది రైతులకు రూ.101 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో నాచురల్, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్నారు. వరి కొనుగోలులో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో పాటు బోనస్ కూడా అందజేస్తున్నామని చెప్పారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ గుమ్మడవెల్లి ప్రాజెక్టు రింగ్‌బండ్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నందున ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని కోరారు. అశ్వారావుపేటలోని అంకమ్మ చెరువు నుంచి లోతువాగు–దెబ్బతోగు ద్వారా గుమ్మడవెల్లి ప్రాజెక్టుకు నీరు చేరే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన భూ సేకరణ కొంతవరకు పూర్తై, కొంత పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ భూ సేకరణను పూర్తి చేయాలని మంత్రులను కోరారు. మూకమామిడి ప్రాజెక్టు ద్వారా 7,675 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ శాఖ మంత్రి దిశానిర్దేశంలో పలు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, బయోచార్ తయారీ వంటి అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువ రైతులు ఆధునిక సాంకేతికతతో వ్యవసాయంలోకి రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణను సమర్థవంతంగా వినియోగించుకొని రైతులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉందన్నారు. సమీకృత వ్యవసాయాన్ని అవలంబించాలని, ములకలపల్లి మండలం మొరంపల్లి బంజర గ్రామంలో మహిళలు సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాభాలు సాధిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమానికి పీజేటీఎస్ ఏయూ, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీలు జానయ్య, రాజిరెడ్డి, టీజీ ఆయిల్ఫైడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయశాఖ ప్రధాన కార్య దర్శి సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ సంచాల కులు గోపి, ఉద్యానశాఖ సంచాలకులు, టీజీ ఆయి ల్ఫైడ్ ఎండీ ఎండీ శ్రీమతి యాస్మిన్బాషా హాజరు అయ్యారు. సమావేశంలో టీజీ ఆయిల్డ్ బోర్డు సభ్యుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.