పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 బోధన్: గ్రామాలలో అధికారులు ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించవలసిందిగా బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి పంచాయతీ సిబ్బందికి సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బోధన్ రూరల్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో శుక్రవారం సాలూర మండల కేంద్రంలో గ్రామపంచాయతీల సిబ్బందికి ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన విధివిధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంపీడీవో శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు హాజరయ్యారు. ట్రాఫిక్ నియమ నిబంధనలో పాటించడం వలన రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. నియమాలు పాటించకుండా వాహనాలు నడిపినట్లయితే జరిమానాలతో పాటు జైలు శిక్షలు సైతం అనుభవించవలసి వస్తుందని హెచ్చరించారు.మైనర్ లకు మాత్రం వాహనాలను ఇవ్వకూడదని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాద రహిత తెలంగాణను సాధించుకుందామన్నారు. రోడ్డు నియమాలు పాటించకుండా వాహనాలు నడిపినట్లయితే ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారమవుతామని హితవు చెప్పారు. రోడ్డు నియమాలను పాటించి సహకరించ వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.