ఉప్పల్ భగాయత్‌లో సమస్యలు పరిష్కరించాలి

★ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, కమ్యూనిటీ హాల్ నిర్మించాలి ★ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను కోరిన పరమేశ్వర్‌రెడ్డి

పయనించే సూర్యడు /జనవరి 20/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను కోరారు. సోమవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌ను కలిసిన పరమేశ్వర్‌రెడ్డి, భగాయత్‌లోని సమస్యలపై వినతిపత్రం అందజేశారు. భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లేఅవుట్ ఫేజ్–1, ఫేజ్–2 ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థలో కొన్ని ప్రాంతాల్లో అవుట్‌లెట్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఇతర మౌలిక వసతుల కల్పన కూడా జరగలేదని తెలిపారు. లేఅవుట్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, కమ్యూనిటీ హాల్ ఇప్పటివరకు నిర్మించకపోవడంతో యువత, స్థానికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇటీవల వాటర్ వర్క్స్ విభాగం చేపట్టిన పైప్‌లైన్ పనుల కారణంగా ఉన్న రోడ్లు మరింత దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ అన్ని పనులను వెంటనే చేపట్టాలని కోరగా, కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.