చదువే విద్యార్థులకు అసలైన కొలమానం: డాక్టర్ కె. శ్రీధర్

పయనించే సూర్యుడు మార్చ్ 7 (జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) కొత్తూరు (బి): విద్యార్థుల భవిష్యత్తుకు చదువే నిజమైన కొలమానమని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని బాలాజీ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కె. శ్రీధర్ పేర్కొన్నారు. నేడు జెడ్ పి హెచ్ ఎస్ కొత్తూరు (బి) పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు శ్రీ చాముండేశ్వరీ ధార్మిక సంస్థ మరియు సంగారెడ్డి బాలాజీ ఆసుపత్రి వారి సహకారంతో పరీక్షల సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా తగినంత నిద్ర, సరిపడా నీరు మరియు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. చరవాణి వంటి సాధనాలకు దూరంగా ఉంటూ, సమయాన్ని వృథా చేయకుండా పట్టుదలతో చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. ప్రియదర్శిని, ఉపాధ్యాయులు బాబు, భాస్కర్, ప్రసాద్ బాబు, సురేష్, తారాబాయి, సునీత, కవిత తదితరులు పాల్గొన్నారు.