పయనించే సూర్యుడు బాపట్ల మార్చ్ 7:- రిపోర్టర్( కే శివకృష్ణ ) కర్లపాలెం మండలం పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ రెండు సామాజిక వర్గాల కొట్లాటకు దారి తీసే విధంగా తయారయింది. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణ రెండు సామాజిక వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగే వరకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న కర్లపాలెం ఎస్సై రవీంద్ర వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో మాట్లాడి ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ సమావేశానికి హాజరైన ఆయన ఎస్సై రవీంద్ర విద్యార్థులందరికీ గట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి పాఠశాల దశ ఎంతో ప్రాముఖ్యమైనదని అలాంటి దశలో ఉన్న మీరు దానిని వ్యర్థం చేసుకోకుండా కేవలం చదువు మీద దృష్టి పెట్టాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు అయితే భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. అనంతరం భవిష్యత్తులో ఇలాంటి గొడవలు జరగకుండా తల్లిదండ్రులందరితో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి సమక్షంలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అనంతరం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఎస్సై రవీంద్ర తీసుకున్న చొరవకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసరి చిన్నోడు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు