గట్లనర్సింగాపూర్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు మార్చి 08 భీమదేవరపల్లి:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కళ్యాణలక్ష్మి' పథకం కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని గట్లనర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్ అన్నారు. శనివారం భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కులను సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన నాగిల్ల కోమల, గాజు సారమ్మ, సట్ల రేణుకలకు ఈ చెక్కులను అందజేశారు. ముగ్గురు లబ్ధిదారులకు రూ.3,00,348/- రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి అదనపు మండల గిర్ధావర్, రాజు, గ్రామ పాలన అధికారి అరవింద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గుడికందుల మధు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.