పయనించే సూర్యుడు మార్చి 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మండల విద్యాశాఖ మరియు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనలో మహిళలు చూపుతున్న పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. మండల విద్యాధికారి రఘునందన్ మాట్లాడుతూ సమాజంలో మహిళల ప్రాధాన్యత ఎంతో గొప్పదని, కుటుంబం నుంచి దేశ అభివృద్ధి వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఎంవీఎస్ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాషిణి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వేచ్ఛ సాధించడం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం, సామాజిక ఉద్యమాల్లో ముందడుగు వేయడం ద్వారా అన్ని రంగాల్లో విజయాన్ని సాధించగలరని అన్నారు. అగ్రికల్చర్ కళాశాల, పాలెం ప్రొఫెసర్ కవిత మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయానికి వెనుక మహిళ ఉండినట్లే, ప్రతి మహిళ విజయానికి కూడా పురుషుడు అండగా నిలవాలని, సమానత్వ భావనను సమాజంలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. షీ టీం ఇంచార్జ్ ఏఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తూ, భద్రతకు సంబంధించిన పలు సూచనలు ఉపాధ్యాయినిలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండలంలోని మహిళా ఉపాధ్యాయినిలు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు.