పయనించే సూర్యడు / మార్చ్ 10/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కమలానగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పావని మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, నేడు ప్రతి రంగంలోనూ మహిళలు తమ అద్భుత ప్రతిభను చాటుకుంటున్నారని కొనియాడారు. మహిళా సాధికారత కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలో సాధ్యమైనప్పుడే నిజమైన సామాజిక అభివృద్ధి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకల ద్వారా కాలనీలోని మహిళలందరికీ ఆమె ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు, అసోసియేషన్ ప్రతినిధులు మరియు కమలానగర్ కాలనీ వాసులు బొజ్జ రాఘవ రెడ్డి, జనర్దన్ గౌడ్, సహాదేవ్, మల్క రమాదేవి, పద్మ, భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు పావని మణిపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం జరిగింది. మహిళల మధ్య ఐక్యతను పెంపొందించడానికి మరియు వారిలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయని కార్యక్రమ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.