రైతుల సమస్యకు స్పందించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

★ ప్రోక్లేంతో చెట్ల కంపను పూడికలు తొలగిస్తున్న గ్రామ సర్పంచ్

పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ వట్టెం ప్రధాన కాలువ నుండి గుడ్లనర్వ వసంతాపూర్ పొలాలకు వెళ్లే ఉపకాలువలు పూడికతో నిండిపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను స్థానిక రైతులు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే కాలువల పూడికతీత పనులను ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రోక్లెయిన్ యంత్రంతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు అడ్డుగా ఉన్న చెట్ల కంపలను తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక వట్టెం ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీరు ఉపకాలువల ద్వారా చివరి పొలాల వరకు సజావుగా చేరుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అతినరపు సంజీవ, కత్తే పర్వతాలు, స్థానిక రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల సమస్యను వెంటనే గుర్తించి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.