ఇకపై రైతులు గడ్డి మందు కొనాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి

పయనించే సూర్యుడు మార్చి 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ వ్యవసాయంలో కలుపు మొక్కలను నివారించేందుకు రైతులు విస్తృతంగా ఉపయోగిస్తున్న మందు రైతుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మందు విక్రయాలపై నియంత్రణ విధిస్తూ, ఇకపై వ్యవసాయ అధికారుల అనుమతి ఉన్నప్పుడే రైతులకు గడ్డి మందును విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఈ రసాయన మందును పంటలలో కలుపు నివారణ కోసం విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ, అనుకోని ప్రమాదాలు, ఆత్మహత్యలకు ఈ మందు కారణమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గడ్డి మందుల విక్రయాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై రైతులు గడ్డి మందు కొనుగోలు చేయాలంటే ముందుగా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. అధికారులు రైతుల పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించి నిజంగా గడ్డి మందు అవసరం ఉందని భావించినప్పుడు మాత్రమే ప్రత్యేక డిస్క్రిప్షన్ (ప్రమాణ పత్రం) ఇవ్వనున్నారు. ఆ డిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే రైతులు పురుగు మందుల దుకాణాల నుంచి గడ్డి మందును కొనుగోలు చేయగలరు. అలాగే ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఈ మందు విక్రయాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి రైతు వివరాలు, ఇచ్చిన డిస్క్రిప్షన్ వివరాలు, విక్రయించిన మందు పరిమాణం వంటి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని అధికారాలు ఆదేశించాయి. ఈ విధానం ద్వారా గడ్డి మందుల అనవసర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా రైతుల ప్రాణ భద్రతను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. రైతులు కూడా ఈ నియమాలను పాటిస్తూ అవసరమైతే మాత్రమే మందులను వినియోగించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *