పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 11 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ కౌతాళం జెడ్పీ పాఠశాలలో ప్రభుత్వ బియ్యం అక్రమ రవాణా జరిగిన వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబ్బీర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. ఈరేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల హెడ్మాస్టర్ ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై ఫిబ్రవరి 23న కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అయ్యే బియ్యం విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడాల్సి ఉండగా, అక్రమంగా తరలించబడుతున్నట్లయితే అది తీవ్రమైన విషయం అని పేర్కొన్నారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.