14 న జరిగే అంజన్న ఆశీర్వాద యాత్ర సక్సెస్ చేయాలి

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరిట ఈనెల 14న తలపెట్టిన ‘‘మహా పాదయాత్ర’’ను బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ ముఖ్య నేతలు, కార్పొరే టర్ లతో బుధవారం రోజున కరీంనగర్ లోని ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్ లో ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ సన్నాహక సమావేశం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కరీంనగర్ మేయర్ పదవిని బిజెపికి ఎప్పగిస్తే తన పార్లమెంటు పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారన్నారు. అంజన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా బిజెపిని ఆశీర్వదించి మేయర్ పీఠాన్ని అప్పగించడంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మొక్కు చెల్లించుకోవడానికి సిద్ధమయ్యారని, ఆ మేరకే ఈనెల 14న అంజన్న ఆశీర్వాదయాత్ర పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ యాత్రకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఉపసర్పంచులు సర్పంచులు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు దాదాపు పదివేల మంది కార్యకర్తలతో కలిసి ఈ మహా పాదయాత్ర ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేయబోతున్నారని తెలిపారు. ముఖ్యంగా 14వ తేదీనే 10వ తరగతి విద్యార్ధులు వార్షిక పరీక్షలుజరుగుతున్నందునపాదయాత్ర సందర్భంలో రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తేతకుండా , క్రమశిక్షణతో యాత్ర ముందుకు కొనసాగాలన్నారు.14న (శనివారం) ఉదయం 6 గంటలకే మహాశక్తి ఆలయానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తరలిరావాలని సూచించారు. ముఖ్యంగా బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులంతా తప్పకుండా అంజన్న ఆశీర్వాద యాత్రలో పాల్గొనాలన్నారు. 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ఈ మహా పాదయాత్ర ప్రారంభమవుతుందనీ , రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, కొడిమ్యాల, మల్యాల మీదుగా కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకోవడం జరుగుతుంది అని, దాదాపు 40 కి.మీల మేరకు కాలి నడకన వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేంద్రమంత్రి బండి సంజయ్ మొక్కులు చెల్లించనున్నారని తెలిపారు. అనంతరం కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, వాసాల రమేష్ , సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, ఓదెలు తో పాటు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, కరీంనగర్ జోన్ బాధ్యులు, వివిధ మోర్చాల బాధ్యులు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *