పయనించే సూర్యుడు మార్చి 13 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీ జ్ఞానేశ్వర్ వాత్సల్య మందిర్ (అరక్షిత బాలికల ఆశ్రమం) కు ఆపరేషన్ స్మైల్ ఆర్గనైజేషన్ సభ్యురాలు మలిపెద్ది శ్రీజ బాలికల విద్యాభివృద్ధి కోసం రూ.15 వేల విలువ గల ట్యాబ్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం మాట్లాడుతూ, బాలికల చదువుకు ఉపయోగపడేలా ట్యాబ్ను అందజేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఆశ్రమంలోని బాలికలకు పండ్లు పంపిణీ చేసి, వారి విద్యాభ్యాసం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆశ్రమ వార్డెన్ కల్పన మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని, ట్యాబ్ ద్వారా బాలికలు సులభంగా డిజిటల్ విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీజ కుటుంబ సభ్యులు, ఆశ్రమంలోని బాలికలు మరియు ఇతరులు పాల్గొన్నారు.