ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు అమలు చేయాలి కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్

రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 తెలంగాణ రాష్ట్రము లో ప్రవేట్ పాఠశాలలో అమలు చేయాలి

పయనించే సూర్యుడు మార్చ్ 15 (హైదరాబాద్ మాధవరెడ్డి ) తెలంగాణ రాష్ట్రంలో విద్య హక్కు చట్టం 2009 లోని సెక్షన్ 12(1)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ ప్రభుత్వాన్ని కోరింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21-A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి పిల్లవాడికి ఉచిత తప్పనిసరి విద్య అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ఏయిడెడ్ పాఠశాలలు తమ ప్రవేశ స్థాయిలో కనీసం 25% సీట్లను ఆర్థికంగా బలహీన వర్గాలు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు కేటాయించి ఉచిత విద్య అందించాల్సి ఉంటుందని తెలిపారు.అయితే తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని సంస్థ అభిప్రాయపడింది. దీనివల్ల పేద మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన అనేక మంది పిల్లలు నాణ్యమైన విద్యను పొందే అవకాశాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఓఎస్ డి జీనాఆతర్ సయ్యద్ అహమ్మద్ కు వినతి పత్రం సమర్పించి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో సెక్షన్ 12(1)ను కచ్చితంగా అమలు చేయాలని 25% ఉచిత సీట్ల కోసం పారదర్శకమైన ఆన్‌లైన్ అడ్మిషన్ విధానాన్ని ఏర్పాటు చేయాలని మరియు చట్టాన్ని ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు 2026-2027 విద్యా సంవత్సరానికి ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ కృషి చేస్తుందని సంస్థ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొమ్ము నరేష్ బాబు, వై మాధవ రెడ్డి వెంకటేష్, మల్లేశ్వరరావు మహేశ్వరరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.