రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి – పీఆర్‌పీఏ డిమాండ్

పయనించే సూర్యుడు మార్చి 15, (చింతకాని మండలం రిపోర్టర్. ఏర్పుల కోటేశ్వరరావు) చింతకాని : ఖమ్మం జిల్లా నాగులవంచలో పీఆర్‌పీఏ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీఆర్‌పీఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు (వైవి) మాట్లాడుతూ 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు తమ సేవా కాలంలో దాచుకున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 700 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సమస్యకు పూర్తి పరిష్కారం కాదని ఆయన తెలిపారు.ఉద్యోగ విరమణ పొందిన తర్వాత 22 నెలలు గడుస్తున్నప్పటికీ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం వల్ల పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మనోవేదనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.అందువల్ల ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రిటైర్డ్ ఉద్యోగులు సేవాకాలంలో దాచుకున్న సొమ్మును విడుదల చేసి, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో ఎస్. మధుసూదన్ రెడ్డి, జి. చంద్రశేఖర్, నంజాల పుల్లయ్య, అంబటి శాంతయ్య, డి. శివ నారాయణ రెడ్డి, ఎం. బాబురావు, తాత రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.