షేక్ మాబు పై పీడీ యాక్ట్ – ఖండించిన మైనార్టీ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 15 యడ్లపాడు మండల ప్రతినిధి పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ షేక్ మాబు పై పిడుగురాళ్ల పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి రాజమండ్రి జైలుకు తరలించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే ఇలాంటి కఠిన చట్టాలు ప్రయోగించడం అత్యంత దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా మైనార్టీ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపుల కోసమే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ యువ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ముప్పని ఆయన అన్నారు. ప్రజల తరఫున న్యాయం కోసం మాట్లాడినందుకే షేక్ మాబు పై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టం ప్రయోగించడం పూర్తిగా అన్యాయమని, వెంటనే ఆయనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని విడుదల చేయాలని ప్రభుత్వం మరియు పోలీసు అధికారులను సయ్యద్ కరిముల్లా డిమాండ్ చేశారు. నిజం కోసం నిలబడే నాయకులను కేసులతో అణగదొక్కాలని చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, ప్రజలే దీనికి తగిన సమాధానం ఇస్తారని ఆయన హెచ్చరించారు.