పయనించే సూర్యుడు మార్చి 17 కరీంనగర్ న్యూస్: సమస్యల పరిష్కారం కోసం ఎంతో దూరం నుంచి ప్రజావాణికి వచ్చి విన్నవించే బాధితులకు అధికారులు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలను స్వీకరించారు. బాధితులు చెప్పిన సమస్యలను ఆలకించారు.. వెంటనే పరిష్కారం అయ్యే దరఖాస్తులపై సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమయం తీసుకునే దరఖాస్తులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. దరఖాస్తులను ఓపిగ్గా పరిశీలిస్తూ సమస్యలు ఆలకిస్తూ బాధితుల్లో జిల్లా కలెక్టర్ భరోసా నింపారు. వృద్ధులు దివ్యాంగుల వద్దకే కలెక్టర్ స్వయంగా వెళ్లి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 290 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల బాధ్యతలు తీసుకున్న జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహిస్తున్నారు. ప్రజావాణి దరఖాస్తులపై అధికారులకు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.