
పయనించే సూర్యుడు మార్చి 18, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్ అన్న గురజాడ మాటలను అక్షరాలా నిజం చేసింది ఆ కుటుంబం. వ్యక్తిగత సౌకర్యం కంటే సామాజిక ప్రయోజనమే మిన్న అని చాటిచెప్పారు. వివరాల్లోకి వెళితే…రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కిష్టారం సరోజనమ్మ కుటుంబ సభ్యులు గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు వెడల్పు పెంచే క్రమంలో తమ సొంత ఇల్లు అడ్డంకిగా మారడంతో, ఏమాత్రం సంకోచించకుండా సరోజనమ్మ, వారి కుమారులు కీ.శే. రమేష్ గౌడ్ ఆశయ సాధనలో భాగంగా.. ప్రస్తుత సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్, ఉదేశ్ గౌడ్ కలిసి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునని లక్షల విలువ చేసే స్థలాన్ని లెక్కచేయకుండా, ఊరి ప్రగతి కోసం తమ ఇంటిని జెసిబితో కూల్చివేసారు.సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ..పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సేవలోనే కిష్టారం కుటుంబం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మా ఇల్లు పోయినా పర్లేదు.. ఊరి అభివృద్ధి ఆగకూడదు , ఊరి జనం బాగుండాలన్నారు.సాధారణంగా ప్రస్తుత సమాజంలో సెంటు భూమి కోసం కూడా వివాదాలు జరిగే పరిస్థితి ఉంది, అలాంటిది గజం స్థలం వదులుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడని, కోట్లాడుకునే ఈ రోజుల్లో, ఏకంగా నివాసాన్నే కూల్చుకోవడం ఆ కుటుంబం యొక్క సేవా దృక్పథానికి నిదర్శనం అంటూ పలువురు కొనియాడారు. ఇలాంటి నాయకులు ఉంటే ఏ గ్రామమైనా త్వరగా ప్రగతి పథంలో పయనిస్తుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉదేశ్ గౌడ్, నరిగె చెన్నయ్య దూళ్ల సాయి శ్రీశైలం, అనుమారి ప్రవీణ్ కుమార్ , శివలింగం గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.