దివ్యాంగుడి వద్దకు స్వయంగా వెళ్లి అర్జీ స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు 18-03-2026 పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన ఒక దివ్యాంగుడి వద్దకు ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి అతని సమస్యను ఆప్యాయంగా అడిగి తెలుసుకుని అర్జీని స్వీకరించారు. అర్జీదారుడు తనకు జీవనోపాధి మరియు దైనందిన అవసరాలకు ఉపయోగపడే విధంగా బ్యాటరీ సైకిల్ అందించాలని కోరగా, ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే బ్యాటరీ సైకిల్ తెప్పించి అందజేస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అవసరమైన వారికి సహాయం అందేలా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తెలిపారు.