మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

పయనించే సూర్యుడు , 18 మార్చి 2026, భీంగల్ మండల్ ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి , నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో మంగళవారం రోజున భీంగల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్ రూమ్ మరియు కిచెన్ రూమ్‌ను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే పాఠశాల బాత్రూంలను పరిశీలించిన కమిషనర్, బాత్రూంలలో టైల్స్ వేయాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. ప్రహరీ గోడ కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ వెంటనే కొత్త గోడను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కమిషనర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా బాలికల పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ, ఇన్‌చార్జ్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ సంతోష్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.