పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 18.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) మదనపల్లి, మార్చి 17: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే తమ కష్టార్జితాన్ని కాపాడుకోగలరని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రజలనుద్దేశించి ఒక ముఖ్యమైన సందేశాన్ని విడుదల చేశారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ వేదికగా జరుగుతున్న అక్రమాలపై ఎస్పీ పలు సూచనలు చేశారు.. వాట్సాప్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చే తెలియని లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు. ఓటీపీ, బ్యాంకు వివరాలు, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పకూడదు. సోషల్ మీడియా వేదికగా మహిళలు, చిన్నారులను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే ఏం చేయాలి ఒకవేళ మీరు ఆన్లైన్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలని ఎస్పీ సూచించారు. ఆర్థిక పరమైన సైబర్ నేరం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయండి. మోసం జరిగిన మొదటి 1 గంట (గోల్డెన్ ఎవర్) అత్యంత కీలకం. వెంటనే ఫిర్యాదు చేస్తే మీ ఖాతా నుండి పోయిన డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నేరుగా వెబ్సైట్లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు ఉండాల్సిన వివరాలు.. ట్రాన్సాక్షన్ ఐడి మరియు తేదీ. మోసగాళ్ల ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు. చాటింగ్ స్క్రీన్ షాట్లు మరియు వచ్చిన సందేశాల వివరాలు. సైబర్ నేరగాళ్లు మీ అమాయకత్వాన్ని, ఆశను పెట్టుబడిగా మార్చుకుంటారు. భయపడి విషయాన్ని దాచడం వల్ల నేరగాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయండి" అని ఎస్పీ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా ప్రజల రక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాపోలీస్ యంత్రాంగం