ముట్టడి ముందు అరెస్టులు_ఆశ వర్కర్లు ఆగ్రహం చెరరేగింది

"ఆశ వర్కర్ల డిమాండ్లను వెంటనే అమలు చేయాలి"

పయనించే సూర్యుడు మార్చి 21 రాజేష్ ) దౌల్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆశ వర్కర్లు తలపెట్టిన మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం సందర్భంగా భారీగా చేరుకున్న ఆశ కార్యకర్తలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా అణచివేత విధానాలు అవలంబించడం సరైంది కాదని మండిపడ్డారు. మంత్రుల ఇళ్ల ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను పోలీసులు అడ్డుకుని, బలవంతంగా అరెస్టులు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. బొల్లం రేణుక, పి. కనక లక్ష్మి, టి. కౌసల్య, డి. రజిత తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. ఈ అరెస్టులపై ఆశ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. “ఎన్ని అరెస్టులు చేసినా, తప్పకుండా చలో హైదరాబాద్… అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేస్తాం” అంటూ హెచ్చరించారు. ఆశ వర్కర్ల పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లు మరింత బలపడుతున్నాయి.