పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 23 ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు రవాణా పంథాను మార్చుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్కు తరలించి, అక్కడి నుంచి ఓఆర్ఆర్ గుండా మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ నెల 17న పంతంగి టోల్ప్లాజా వద్ద రూ.33 లక్షల విలువైన 60.685 కిలోల గంజాయిని యాదాద్రి జిల్లా అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లర్లు జర్నీకి బ్రేక్ ఇస్తూ, వాహనాలు మారుస్తూ సరకును గమ్యానికి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. గతంలో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తరలించేవారు, కానీ నిఘా కారణంగా పద్ధతి మార్చారు. దాడుల్లో పట్టుబడుతున్న సరకును చూస్తే, రహస్యంగా తరలిపోతున్నది మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.