చింతకాని మండలంలో 24న డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన సదస్సులు

పయనించే సూర్యుడు మార్చి 23, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలో డ్రగ్స్‌ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈనెల 24న విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ డీఎస్పీ బృందం సమన్వయం చేస్తోంది. ఈ కార్యక్రమం భాగంగా గాంధీనగర్ కాలనీ, రామకృష్ణాపురం, నాగులవంచ, చింతకాని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 24/03/2026న ఉదయం 10 గంటలకు గాంధీనగర్ కాలనీలోని పాఠశాలలో, మధ్యాహ్నం 12 గంటలకు రామకృష్ణాపురంలో, మధ్యాహ్నం 2 గంటలకు నాగులవంచలో, సాయంత్రం 4 గంటలకు చింతకానిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ సర్పంచులు, మండల అధికారులు పాల్గొంటారని తెలిపారు. గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సై వీరేందర్ కోరారు.