పయనించే సూర్యుడు మార్చి 24, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం బస్వాపురం గ్రామంలోని రైతు వేదికలో పంట మార్పిడి పై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అఖిల భారత సమగ్ర వ్యవసాయ పరిశోధన విభాగం, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డా॥ ఎం.డి. లతీఫ్ పాషా సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు వివరణ ఇచ్చారు. ప్రధాన శాస్త్రవేత్త (ఆపరాలు) డా॥ కె. రుక్మిణీ దేవి పప్పు దినుసులైన పెసర, మినుము పంటలలో మెరుగైన రకాలు, యాజమాన్య విధానాలపై వివరించారు. శాస్త్రవేత్త నాగజ్యోతి వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.అలాగే కె.వి.కె. శాస్త్రవేత్త డా॥ వి. చైతన్య ఉద్యాన పంటల యాజమాన్య పద్ధతులపై సూచనలు ఇచ్చారు. డా॥ కె. శ్రీధర్ యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు మార్గనిర్దేశనం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల నర్సింహారావు, మండల వ్యవసాయ అధికారిణి మానస, వ్యవసాయ విస్తరణ అధికారిణి ఆయేషా, పరిశోధన సిబ్బంది వినయ్, సాయి బాబా, అభ్యుదయ రైతు ఆవుల తిరుపతయ్యతో పాటు సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.