పాలెంలో ఘనంగా ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ర్యాలీ నిర్వహణ

కార్యక్రమంలో పాలెం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక

పయనించే సూర్యుడు మార్చి 25 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మార్చి 24న ప్రతి సంవత్సరం టీబీ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ నిర్ధారణ, చికిత్స ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి క్షయవ్యాధిగ్రస్తులకు ప్రతినెల రూ.1000 పౌష్టికాహార సహాయం అందిస్తోందని, కార్పొరేట్ సంస్థల ద్వారా పోషకాహార కిట్లు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. సరైన చికిత్సతో టీబీ పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బాదం రాజేశ్వర్ హెల్త్ సూపర్వైజర్ గోవిందు సుజాత ఏఎన్ఎం గజవర్ధనమ్మ హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్ ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.