బ్రాహ్మణ సంక్షేమం కూటమితోనే సాధ్యం – చమర్తి

పయనించే సూర్యుడు-25-03-2026-రాజంపేట న్యూస్ : బ్రాహ్మణుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉన్నామని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. మంగళవారం రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు బ్రాహ్మణులతో సమావేశమై వారి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ప్రాచీన విశిష్టత కలిగిన హత్యరాల, పరశురామ ఆలయ విశిష్టతలను మరింత విస్తరింపజేయాలన్నారు. బ్రాహ్మణులకు అన్నివేళలా అండగా ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని వారికి భరోసా కల్పించారు. అంతకుముందు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామి వారిని చమర్తి జగన్ మోహన్ రాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హత్యరాల, ఆంజనేయ స్వామి దేవస్థానాల చైర్మన్లు తలిశెట్టి రమేష్, రాజంపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.