పయనించే సూర్యుడు మార్చ్ 26 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు )
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాలిడేషన్ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జహీరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు మార్చి 25ను నల్ల దినంగా పాటిస్తూ పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రధాన మంత్రికి ఉద్దేశించిన వినతిపత్రాన్ని జహీరాబాద్ రెవెన్యూ డివిజనల్ పరిపాలనాధికారి శశిధర్కు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్ధన్ మాట్లాడుతూ, ఈ చట్టం ద్వారా పెన్షనర్ల మధ్య పాత, కొత్త అనే విభజన చూపే అధికారం ప్రభుత్వానికి వస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. భవిష్యత్తులో వచ్చే వేతన సవరణ సంఘం ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల దేశవ్యాప్తంగా 65 లక్షల మంది పెన్షనర్లు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి పెన్షన్ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పటేల్ రాజేందర్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ బసవరాజు ఇబ్రహీంపూర్, కోశాధికారి బి. చంద్రశేఖర్, సభ్యులు కె. ప్రభాకర్, కె. రాజశేఖర్, అనంతయ్య, ధర్మయ్య, రాచయ్య, మహమ్మద్ గౌరీ, ఎం.డి. అజీమ్, రాందాస్, నరసింహారెడ్డి, ఎస్. నర్సింలు, ఎం.డి. యాకుబ్, బాగారెడ్డి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.