పయనించే సూర్యుడు మార్చి 27, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలమని చింతకాని ఎస్సై వీరేందర్ పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని తగ్గించడం, ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి చేరడం లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ మూడవ విడత అవగాహన కార్యక్రమం భాగంగా గురువారం చింతకాని మండలం కోదుమూరు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై వీరేందర్ మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వినియోగంలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు శిక్షలతో పాటు ప్రజల్లో అవగాహన పెంపు అత్యంత అవసరమని భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, జాతీయ రహదారులు మరియు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లలో ప్రజలను నేరుగా కలుసుకుని రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్సై వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.