బోయపాలెంలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానం 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ..

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 యడ్లపాడు మండల ప్రతినిధి.. పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామంలోని వాల్మీకి నగర్‌లో ఉన్న శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో 12వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు వడ్డేపల్లి నరసింహారాజు, కవిత దంపతుల ఆధ్వర్యంలో, దాతల సహకారంతో వేకువజామునుండే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, హోమ పూజలు, శేష అలంకరణలు అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిరిలో నూతన దంపతుల చేత సీతారాముల శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదంగా పంపిణీ చేయగా, మధ్యాహ్నం నిర్వహించిన మహా అన్నసంతర్పణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *