పయనించే సూర్యుడు మార్చి 29, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్: ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న దౌత్య నీతి, విదేశాంగ విధానాలు ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను శిఖరాగ్రానికి చేర్చాయని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ కొనియాడారు. రమణయ్యపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో మోడీ ప్రదర్శిస్తున్న చొరవ దేశానికి రక్షణ కవచంలా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుంటే, భారత్ మాత్రం మోడీ దౌత్యం వల్ల సురక్షితంగా ఉందని ఆయన వివరించారు. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోనే పెట్రోల్ ధరలు 40 శాతం పెరిగినప్పటికీ, మన దేశంలో చమురు కొరత లేకుండా చూడటమే కాకుండా, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యుడిపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. ఆపరేషన్ సింధూర్ వంటి లక్ష్యాలను సాధించడంలో ప్రధాని చూపిన పట్టుదల, అంతర్జాతీయంగా ఆయన పరపతిని పెంచిందని రత్న ప్రసాద్ విశ్లేషించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంటి నేతలు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించినా, దేశ ప్రయోజనాలే పరమావధిగా మోడీ నిగ్రహం పాటిస్తూ తటస్థ వైఖరిని అవలంబించారని ఆయన కొనియాడారు. రక్షణ, వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతి మన దేశాన్ని త్వరలోనే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షోభ సమయాల్లోనూ మన నౌకల రాకపోకలకు ఇరాన్ పచ్చజెండా ఊపడం మోడీ సాధించిన గొప్ప దౌత్య విజయమని ఆయన పేర్కొన్నారు.