ఎమ్మెల్యే కలెక్టర్ సిపి ఆదేశాలు బేఖాతరు చేస్తూ బోధన్ లో అక్రమ ఇసుక రవాణా.

★ స్థానిక బోధన్ పోలీస్ సిబ్బంది కనుసనల్లో. ★ ఇసుక ఉదయం 10 గంటల వరకు తోలుకోండి? ★ కొందరు పోలీస్ సిబ్బంది సహకారంతో ఇసుక తరలిస్తున్నామంటూ ట్రాలీ ఆటో ట్రాక్టర్ యజమానులు అంటున్నారంటూ గుసగుసలు. ★ అక్రమ ఇసుక రవాణా లక్ష్మణ రేఖ గీసేవారు లేరా.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 30 బోధన్ : మంజీరా పరివాహక ప్రాంతం సాలూర మండలం మందర్న గ్రామం నుంచి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య ఆదేశాలు బేఖాతరు చేస్తూ స్థానిక పట్టణ, రూరల్ పోలీస్ ఠాణాలలో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీస్ శాఖ సిబ్బంది కనుసనల్లో అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా సాగుతుందనే విమర్శలు లేకపోలేదు. ఇసుక కొరత వలన నిర్మాణదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు పోలీస్ సిబ్బంది పరిచయాలతో అనుమతులులేని ఇసుక రవాణా చేస్తున్నామంటూ ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆటోల యజమానులే అనుకుంటున్న మాటలు ప్రజల గుసగుసల్లో వినిపిస్తున్నాయి. ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చడంతో అక్రమార్కులు నిర్మాణదారుల అత్యవసరాలను ఆసరాగా చేసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తూ నిర్మాణదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆటోలలో అనుమతులు లేకుండా ఇసుకను తరలించడంతో ఎక్కడ ఎవరు పట్టుకుంటారో అన్న సందేహంతో రోడ్లపై అతివేగంగా నడుపుతున్నారు. ప్రయాణికులు అటుగా ప్రయాణం సాగించలేక పోతున్నారనడానికి వీరి అతివేగమే ప్రధాన కారణం అంటూ వాహనదారులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇసుక రవాణా విషయంలో ప్రస్తుతం అవలంబిస్తున్న నియమ నిబంధనలను సడలిస్తూ పాత పద్ధతిలో ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చినట్లయితే ఇసుక కొనుగోలులో ఎలాంటి దోపిడీలు జరగకుండా ఉండడంతోపాటు తక్కువ ధరకే ఇసుక లభిస్తూ నిర్మాణ పనులు సాగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.