చిన్నారి ప్రాణాలకు అండగా నిలిచిన భూక్యా జాన్సన్ నాయక్

మాట నిలబెట్టుకున్న ప్రజా నాయకుడు – మున్సిపల్ ఎన్నికల హామీకి న్యాయం

పయనించే సూర్యుడు మార్చ్ 31 (నిర్మల్ జిల్లా) ఖానాపూర్, కడెం మండలం ధర్మాజీ పేట్ గ్రామానికి చెందిన కడారి శివకుమార్, శిరీష దంపతులు ప్రస్తుతం ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరి రెండేళ్ల కుమారుడు కడారి బన్నీ కొంతకాలంగా తీవ్రమైన మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండటంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం సహాయం అందించాలని ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్‌ను సంప్రదించారు. సమస్యను తెలుసుకున్న ఆయన, ఎన్నికల అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వెంటనే స్పందించారు. జాన్సన్ నాయక్ స్వయంగా కుటుంబాన్ని పరామర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, నిపుణులైన వైద్యులతో సంప్రదింపులు జరిపించారు. అనంతరం బాలుడిని ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన చికిత్స ప్రారంభించేందుకు సహకరించారు. వైద్య సదుపాయాలు కల్పించడం నుండి చికిత్స పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సమయానికి ఆపరేషన్ జరగడంతో చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడింది. తమ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడటానికి సహకరించిన జాన్సన్ నాయక్‌కు శివకుమార్, శిరీష దంపతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “సమస్య చెప్పగానే స్పందించి మా బిడ్డకు ప్రాణం పోశారు. మా కుటుంబానికి అండగా నిలిచిన జాన్సన్ అన్న సేవలను జీవితాంతం మర్చిపోలేం” అని వారు భావోద్వేగంతో పేర్కొన్నారు.