నిలిపి ఉంచిన బైక్‌ను ఢీకొట్టిన వాహనం – లైసెన్స్ లేని యువకుల నిర్లక్ష్యం

★ తప్పిన ప్రాణాపాయం.. తీవ్రంగా దెబ్బతిన్న జర్నలిస్టు వాహనం ★ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యువకులు ★ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 31 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రహదారి నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని వ్యక్తులు వాహనాలు నడపడం వల్ల సామాన్య ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. తాజాగా 'పయనించే సూర్యుడు' పత్రిక అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు చెందిన బైక్‌ను ఒక ప్రైవేట్ వాహనం (నెం. AP37TE4977) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బైక్ రోడ్డు పక్కన నిలిపి ఉంచి ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఘటన వివరాలు: నిన్న మధ్యాహ్నం జర్నలిస్ట్ తన వ్యక్తిగత పని నిమిత్తం ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు తన బైక్‌ను రోడ్డు పక్కన సురక్షితంగా పార్క్ చేసి ఉన్నారు. అదే సమయంలో అప్పుడే వాహనం నడపడం నేర్చుకుంటున్న కొందరు యువకులు అజాగ్రత్తగా, అతివేగంతో వచ్చి నిలిపి ఉంచిన బైక్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ తీవ్రంగా దెబ్బతింది. వాహనం నడుపుతున్న యువకుల వద్ద కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం గమనార్హం. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైనం: ప్రమాదం జరిగిన వెంటనే వాహనం బాగు చేయిస్తామని నమ్మబలికిన నిందితులు, బాధితుడిని మండపేట వరకు తీసుకెళ్లి చివరకు రిపేర్ చేయించకుండా మొండికేసారు. తమకు పలుకుబడి ఉందని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ, ప్రమాదానికి కారణమైన వారిపై మరియు వారికి వాహనం ఇచ్చిన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మరియు జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి.