పయనించే సూర్యుడు గాంధారి 31/03/26 రోడ్డు భద్రతపై అవగాహన: నాగులూర్ గ్రామ యావకులతో లో "అరైవ్ అలైవ్ - 2026" కార్యక్రమం కామారెడ్డి జిల్లా, గాంధారి: "అరైవ్ అలైవ్ - 2026" కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని నాగులూర్ గ్రామ యువకులతో రోడ్డు భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు స్థానిక ప్రజలకు మరియు యువతకు ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అజాగ్రత్తేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి పొరపాట్ల వల్ల అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని తెలిపారు. ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్.ఐ సూచించారు. "మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనది, నిబంధనలు పాటించడం ద్వారా మీతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారవుతారు" అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'సురక్షితంగా ప్రయాణించండి – సురక్షితంగా గమ్యానికి చేరుకోండి' అనే సందేశంతో ప్రజల్లో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.