వృద్ధాప్య పింఛన్ కోసం ప్రజావాణిలో వృద్ధురాలి వినతి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 31 జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలు తన సమస్యను వినిపించారు. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు గాజులపేటకు చెందిన పానుగంటి ఆశగంగు (87) వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. తాను వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని, జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తగిన ఆధారాలు ఉన్నప్పటికీ పింఛన్ లభించకపోవడంతో అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. కావున తన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె మనవి చేశారు.