సర్పవరంలో హైటెక్ నిఘా ప్రారంభించిన జిల్లా ఎస్పీ..​కాకినాడ జిల్లా ఎస్పీ  చేతుల మీదుగా సీసీటీవీ, ఎ ఎన్ పి ఆర్ కెమెరాల ప్రాజెక్ట్ ప్రారంభించారు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ప్రజల భద్రతే పరమావధిగా, నేరాల నియంత్రణలో సాంకేతికతను జోడిస్తూ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక నిఘా వ్యవస్థను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టును కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ప్రారంభించారు.​ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రముఖ సంస్థలు తమ సామాజిక బాధ్యత ( సి ఎస్ ఆర్) కింద కెమెరాలను విరాళంగా అందించాయి.సర్పవరం పరిధిలోని 19 కీలక ప్రాంతాల్లో హై-డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలనుఓఎన్‌జీసీ ఏర్పాటు చేసింది.వాహనాల రద్దీ అధికంగా ఉండే 9 ప్రధాన జంక్షన్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఎ ఎన్ పి ఆర్) కెమెరాలను ​జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం  ఏర్పాటు చేసిన అధునూతన వ్యవస్థ ద్వారా పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం,కెమెరాల ద్వారా దొంగిలించబడిన వాహనాలు, నేరాలకు వాడే వాహనాల నంబర్ ప్లేట్లను సెకన్లలో గుర్తించడం,రాత్రి సమయాల్లో మహిళల రక్షణ కోసం రద్దీ లేని ప్రాంతాల్లో నిరంతర నిఘా,రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయడం జరుగుతుందన్నారు.​సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కేంద్ర నియంత్రణ గది కు ఈ కెమెరాలన్నీ అనుసంధానించ బడ్డాయని,
శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా షిఫ్టుల వారీగా ఫీడ్‌ను పర్యవేక్షిస్తారు. దీనివల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు పోలీసులు తక్షణమే స్పందించే అవకాశం ఉంటుందన్నారు.సాంకేతికతతో కూడిన నిఘా వల్ల నేరాల విచారణ వేగవంతం అవుతుంది. ప్రజలు మరింత సురక్షితంగా ఉండేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మానిష్, ఓఎన్‌జీసీ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్త, జెమినీ ఎడిబుల్స్ ప్రతినిధులు మరియు సర్పవరం సీఐ బి. పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.