పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్, ఏప్రిల్ 3: పశువుల ఆరోగ్య రక్షణకు టీకాలు అత్యంత కీలకమని మండల పశువైద్యాధికారి పరుశరాములు తెలిపారు. దౌల్తాబాద్ మండలంలోని దీపాయంపల్లి గ్రామంలో నిర్వహించిన పశువుల టీకా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దుర్గేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెలు, ఎద్దులు, గొర్రెలకు పలు సంక్రమణ వ్యాధులను నివారించే టీకాలను పశువైద్య సిబ్బంది అందించారు. రైతులతో మాట్లాడిన పరుశరాములు, “పశువులకు సమయానికి టీకాలు వేయించడం ద్వారా తీవ్రమైన వ్యాధులను ముందుగానే నివారించవచ్చు. ఇది పశుసంపద రక్షణకు మాత్రమే కాకుండా రైతుల ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది” అని అన్నారు. అలాగే పశువులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, శుభ్రమైన నీరు, పోషకాహారం అందించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పశువులకు టీకాలు వేయించుకోవడం విశేషం. పశువైద్య సిబ్బంది రైతులకు పలు వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పశుసంరక్షణపై చైతన్యం మరింత పెరిగింది.