కొయ్యలగూడెంలో అద్భుతం రైతు పొలంలో పురాతన శివలింగం ప్రత్యక్షం.

★ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో అద్భుతం చోటుచేసుకుంది. ★రైతు పొలంలోని బావి వద్ద రాత్రికి రాత్రే పురాతన శివలింగం ప్రత్యక్షం . ★ ఆశ్చర్యానికి గురైన గ్రామస్థులు .

పయనించే సూర్యుడు న్యూస్ చౌటుప్పల్ ఏప్రిల్ 07. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో అద్భుతం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామ శివారులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జంగం సురేష్ రెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద సోమవారం ఉదయం ఓ పురాతన శివలింగం కనిపించింది. రాత్రికి రాత్రే ఈ శివలింగం అక్కడ వెలవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఆ పురాతన శివలింగం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి బయటపడిందా లేక గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా తెచ్చి ఇక్కడ వదిలి వెళ్లారా? అనే అంశంపై గ్రామస్థుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో శివలింగాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. తాళ్ళ మేళాల సప్పుళ్ళతో గ్రామంలోకి ఆహ్వానం హఠాత్తుగా తమ గ్రామ పొలిమేరల్లో శివలింగం ప్రత్యక్షం కావడం శుభసూచకమని గ్రామస్థులు భావిస్తున్నారు. ఆ పరమశివుడే తమ గ్రామానికి వచ్చాడని నమ్ముతూ.. భక్తి పారవశ్యంతో ఆ శివలింగాన్ని మేళతాళాలు, మంగళహారతులతో గ్రామంలోని రామాలయానికి తరలించారు. అనాదిగా తమ గ్రామంపై దైవకృప ఉందని, ఈ శివలింగం లభించడం తమ అదృష్టమని గ్రామ పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పురాతన శివలింగం ఏ కాలానికి చెందిందనే విషయంపై పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో స్థానికులు ఉన్నారు.