రామవరంలో ఘనంగా ‘జలధార’ సాగునీటి భద్రత కార్యక్రమం

★ వర్చువల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ★ సాగునీటి సంఘాల బాధ్యతతోనే పొలాలకు సమృద్ధిగా నీరు: ఎమ్మెల్యే స్పష్టీకరణ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 08 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జలధార" సాగునీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం అనపర్తి మండలంలోని రామవరం గ్రామంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించగా, రామవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని, కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.సాగునీటి సంఘాలదే కీలక పాత్ర:ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. వ్యవసాయానికి సాగునీరు ప్రాణాధారమని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడటంలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. జలధార కార్యక్రమం ద్వారా కాలువల నిర్వహణ, నీటి వృథా అరికట్టడం మరియు సాగునీటి వినియోగదారుల సంఘాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, రైతు సంఘాలు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.అధికారులతో సమీక్ష:ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి, సంబంధిత అధికారులతో స్థానిక నీటి లభ్యత మరియు కాలువల పరిస్థితిపై చర్చించారు. సాగునీటి పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.పాల్గొన్న ప్రముఖులు:ఈ కార్యక్రమంలో అనపర్తి మండల పరిధిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్, నీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు, రైతు నాయకులు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జలధార కార్యక్రమం ద్వారా తమ ప్రాంతంలోని సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.