పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామానికి, తండాలకు బీటి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, త్రిబుల్ ఐటీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జూన్ 23న మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ రోజు మిడ్జిల్ మండలం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని అన్నారు. ఉమ్మడి మిడ్జిల్, ఉర్కొండ మండలాల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులను సీఎం మంజూరు చేస్తారని స్పష్టం చేశారు.అలాగే, మిడ్జిల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో సుమారు 42 లక్షల రూపాయల అవినీతి జరిగిందని, ఉర్కొండలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. ఈ అంశంపై త్వరలోనే పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి ఎమ్మార్వో ,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.