పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 బోధన్ : బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద ఘనంగా నిర్వహిస్తున్న అఖండ హరి నామ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు పాండురంగ పల్లకి ఊరేగింపు మహిళలు మంగళ హారతులతో ఘనముగా నిర్వహించారు ఈ సందర్భంలో శ్రీ పిట్ల కృష్ణ బాలయోగి మల్లారం మహారాజ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి మరియు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గుర్తుచేశారు. భక్తి మార్గం మనిషిని సన్మార్గంలో నడిపించే అత్యంత పవిత్రమైన మార్గమని, ప్రవచనాలు, కీర్తనలు మరియు హరి నామ స్మరణ ద్వారా సమాజంలో ధర్మాన్ని కాపాడటం మన అందరి బాధ్యత అని తెలిపారు. హరి నామ సప్తాహం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఆత్మీయతను పెంపొందించడమే కాకుండా, సత్సంగతిని అలవాటు చేసే మహత్తర వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంత జ్ఞానేశ్వర్ మహారాజ్, జగద్గురు తుకారాం మహారాజ్ వంటి భక్తుల రచనలు మన జీవితానికి మార్గదర్శకాలు అని, వారి గ్రంథాలు మన ధర్మం, మన జీవన విధానం, మన ఆచరణ ఎలా ఉండాలో స్పష్టంగా తెలియజేస్తాయని అన్నారు. వారు చెప్పిన మార్గంలో నడిస్తే ప్రతి మనిషి జీవితంలో శాంతి, సంతోషం మరియు పరిపూర్ణత లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారం మహారాజ్ సంగీత కళాకారులు దిగంబర్ గురూజీ, విడిసి ఛైర్మెన్ గంగాధర్, రామ్ జీ లక్ష్మణ్, మొగులయ్య అశోక్ పూజారి శివ ప్రసాద్ జ్ఞానేశ్వర్ శివ హన్మండ్లు,చందు,భజన మండలి మహిళలు తదితరులు పాల్గొన్నారు