నాడు కళకళ… నేడు విలవిల !

★ పల్లె ప్రకృతి వనాలపై కార్యదర్శుల నిర్లక్ష్యం పట్టించుకోని ప్రజాప్రతినిధులు ★ మండల అధికారుల పర్యవేక్షణ శూన్యం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల వ్యాప్తంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఒకప్పుడు పచ్చని మొక్కలతో కళకళలాడేవి. కానీ నేడు ఆ వనాలు నిర్లక్ష్యానికి గురై మొక్కలు ఎండిపోవడం, పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపించే పరిస్థితికి చేరుకున్నాయి. గతంలో పంచాయతీలలో సర్పంచులు లేరనే కారణంతో అధికారులు బాధ్యత తప్పించుకున్నారు. అయితే ప్రస్తుతం సర్పంచులు పదవిలో ఉన్నప్పటికీ అదే దుస్థితి కొనసాగుతుండటం గమనార్హం. సర్పంచులు లేకపోతే పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు బాధ్యత తీసుకోరా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి వనాల పరిరక్షణపై ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కొత్త మొక్కలు నాటించి సంరక్షణపై కార్యదర్శులు శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుతున్నారు.