జ్ఞాన సముపార్జనకే విద్యా విహారయాత్రలు

* ఉత్సాహంగా హంపి, తుంగభద్ర సందర్శనకు బయలుదేరిన రాజాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు * పుస్తక జ్ఞానానికి ప్రత్యక్ష అనుభవం ఎంతో అవసరం రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ

పయనించే సూర్యుడు జనవరి 20, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అక్షర రూపంలో పుస్తకాల్లో చదివిన చారిత్రక కట్టడాలను, ప్రకృతి అందాలను కళ్లారా చూసేందుకు ఉత్సాహంగా బయలుదేరారు. శనివారం రాత్రి విద్యార్థుల విద్యా విజ్ఞాన విహారయాత్రను గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ.. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు అవి విద్యార్థుల మనసులో బలంగా ముద్ర పడిపోతాయని, కర్ణాటక లోనీ తుంగభద్ర డ్యామ్, చారిత్రక హంపి, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని స్వయంగా సందర్శించడం ద్వారా విద్యార్థులకు చరిత్రపై మక్కువ పెరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ బృందానికి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సంజీవరెడ్డి, సరళ, మోజేస్, శ్రీనివాసులు, శ్యాంసుందర్, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *