పయనించే సూర్యుడు 05-03-26 రాజంపేట న్యూస్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆర్.ఎస్ రోడ్డు లోని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈనెల 1వ తేదీన గుంటూరులో జరిగిన జాతీయస్థాయి టైక్వాండో పోటీలలో శ్రీ చైతన్య పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఎం.రామ్ నరసింహ రితేష్, వై.పెంచల్ ప్రభాస్, ఆరవ తరగతి చదువుతున్న టీ.గోకుల్ చౌదరి లు బంగారు పతకాలు సాధించగా బుధవారం వారిని పాఠశాలలో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం, ఆరోగ్యం మరియు ఆత్మ రక్షణతో పాటు మానసిక వికాసం లభిస్తుందన్నారు. తద్వారా చదువులో కూడా చురుగ్గా వ్యవహరిస్తారని, తమ పాఠశాలలో క్రీడలు, వ్యాయామ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని పేర్కొన్నారు. తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణం అని తెలియజేశారు. కరాటే మాస్టర్ బి.సునీల్ ను ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో తమ పాఠశాల మరిన్ని పతకాలు సాధించే విధంగా తర్ఫీదునివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు టి.చంద్రశేఖర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.