
పయనించే సూర్యుడు మార్చి 12, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ఆరో రోజు బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలో సి.డి.ఎం.ఏ జాయింట్ డైరెక్టర్, నోడల్ ఆఫీసర్ వి. మమత విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, కమిషనర్ జి. లక్ష్మారెడ్డిలతో కలిసి పట్టణంలోని పలు అభివృద్ధి పనులను ఆమె తనిఖీ చేశారు. 7వ వార్డులో నిర్వహించిన ‘అమృత్ మిత్ర’ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అలాగే అమృత్ స్కీం కింద సిగ్నల్ గడ్డ ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్న మంచినీటి ట్యాంకు పనులను పరిశీలించి పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. అనంతరం పోచమ్మ గుడి సమీపంలో ఉన్న నీటి కుంటను సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యం, స్థానిక పరిస్థితులు , పట్టణ పారిశుధ్యం, మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఈ గాయత్రి, వార్డ్ కౌన్సిలర్లు ఉమాదేవి, ఉమా శంకర్ గౌడ్, కుమ్మరి రాజు, మహిళా సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
