పిర్యాదు దారులకు రక్షణ ఎక్కడ

* సమావేశమని పిలిచి తానే పిర్యాదు దారుడంటూ బహిర్గతం చేసిన ఏపిఐఐసి జెడఎం * తనకు రక్షణ కల్పించాలంటూ పిర్యాదు

పయనించే సూర్యుడు మార్చి 17, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ బి వి బి కాకినాడరూరల్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిర్యాదు దారులకు రక్షణ కల్పించి సమస్యను పరిష్కరించాలే తప్ప పిర్యాదు దారుడు ఇతనే అంటూ పిర్యాదు దారులను అధికారులు బహిర్గతం చేస్తుంటే తమకు రక్షణ ఎలా ఉంటుందని పిర్యాదు దారుడు యాదగరి సత్యన్నారాయణ అధికారులను ఆశ్రయించారు. సోమవారం రమణయ్యపేటకు చెందిన పిర్యాదు దారుడు యాదగిరి సత్యన్నారాయణ పాత్రికేయులతో ఏపిఐఐసి అధికారుల తీరుపై ఎండగట్టారు. తాను ఏడాది క్రితం నుండి ఇప్పటికి మూడు సార్లు రమణయ్యపేట ఏపిఐఐసిలో పలు సమస్యలపై మూడు సార్లు పిర్యాదు చేయడం జరిగింది. అనుమతులు లేకుండా ప్లాస్టిక్ వ్యర్దాలు డంప్ చేస్తున్నారని, చాలా పరిశ్రమల్లో అగ్ని ప్రమాద రక్షక ప్రమాణాలు పాటించడంలేదని, పారిశ్రామిక వాడలో అవాసాల అనుమతులు ఎలా ఇచ్చారనే దానిపై పిజిఆరఎస్‌లో మూడు సార్లు పిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై ఇప్పటివరకు ఏపిఐఐసి జెడఎం పొంతన లేని సమాధానాలు ఇస్తూ వచ్చారన్నారు. దీనిపై విసిగిపోయిన తాను ఏపిఐఐసి జెడఎం అవలంభిస్తున్న విధానాన్ని పాత్రికేయులకు చెప్పడం జరిగిందన్నారు. దీంతో గత శుక్రవారం జెడఎం ఫోన్ చేసి పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేశామని తనను పిలువడం జరిగిందన్నారు. తాను పనిలో ఉన్నానని చెప్పినా తప్పకుండా హాజరు కావాలని చెప్పడంతో సమావేశానికి హాజరయ్యాయన్నారు. హాజరైన తర్వాత తానే పిర్యాదు చేసిందని పారిశ్రామిక వేత్తలకు చెప్పడంతో వారు తనపై పలు ప్రశ్నలు సంధించారని, తాను కొన్నింటికి చెప్పి విసిగి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పిజిఆరఎస్‌పై అధికారులు తనకు సమాధానం చెప్పాలని చెప్పి బయటకు వచ్చేసానని అన్నారు. ఎన్నో ప్రజా సమస్యలపై పిర్యాదులు చేస్తున్న పిర్యాదు దారుల సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచాలే గాని ఇలా బట్టబయలు చేస్తే తమకు వారి నుండి రక్షణ ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. దీనిపై సోమవారం పిజిఆరఎస్‌లో పిర్యాదు చేయగా అధికారులు ఏపిఐఐసి అధికారులను పిలిచి మందలించి తక్షణమే సమాధానం చెప్పాలని హెచ్చరించారన్నారు. పారిశ్రామిక వేత్తల నుండి తనకు హానీ జరిగే అవకాశాలు ఉన్నాయని తనకు రక్షణ కల్పించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఏపిఐఐసి అధికారులు ఒకే ప్రశ్నకు రకరకాల సమాధానాలు చెప్పారని, అ వివరాలన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు. తాను ఇచ్చిన పిర్యాదులపై వేరే శాఖ అధికారులతో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *