పయనించే సూర్యుడు మార్చి 22 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గోయాత్ర సందర్భాన్ని పురస్కరించుకుని మార్చి 21, 2026న గుడ్లనర్వ గ్రామంలో గోయాత్ర కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఉదయం 6:00 గంటల నుంచి 11:30 గంటల వరకు గ్రామ వీధుల గుండా మహిళలు, భజనపరులు, యువజన సంఘాల సభ్యులు కలిపి దాదాపు 150 మంది గోవును పూజిస్తూ ఊరంతా ప్రదర్శనగా యాత్ర చేశారు. యాత్ర అనంతరం శివాజీ చౌరస్తా వద్ద సమావేశం ఏర్పాటు చేయగా, గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోపాల్స్ ఫౌండర్ శ్రీ రాంజీ మాట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయం, గో ఉత్పత్తుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, సేంద్రియ వ్యవసాయం ద్వారా రోగరహిత భారత నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల గోపాల్స్ అధ్యక్షుడు శ్రీ శివకుమార్ మాట్లాడుతూ రసాయన రహిత ఆహారం కోసం ప్రతి ఇంట్లో కనీసం ఒక ఆవును పెంచాలని, ఆవుపాలు, నెయ్యి, పిడకలు వంటి గో ఉత్పత్తులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దాసరి శివుడు గుడ్లనర్వ గోపాల్స్ అధ్యక్షుడు దాసరి సురేష్, ఓపెన్ లైబ్రరీ కోఆర్డినేటర్ డి. శ్రీకాంత్, గ్రామవికాస్ జిల్లా సభ్యుడు మేకల శ్రీశైలం కమలాకర్ రావు చలపతిరావు మేకల బంగారయ్య వసుపరి రమేష్ మేకల అఖిలేష్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశం అనంతరం సేంద్రియ ఉత్పత్తులతో తయారుచేసిన పాయసం, పులిహోరను పాల్గొన్న వారికి వడ్డించారు. గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.