పయనించే సూర్యుడు మార్చ్ 22 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు )
జహీరాబాద్: పట్టణంలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రముఖులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, నిష్ట, సహనం, దాతృత్వం మరియు మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా మనసు, ఆలోచనలు పవిత్రమౌతాయని, సమాజంలో పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ మత, వర్గ భేదాలను పక్కన పెట్టి ఐక్యంగా జీవించడం సమాజ అభివృద్ధికి అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఇటువంటి పండుగలు సామాజిక ఐక్యతను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని, రంజాన్ సందేశం శాంతి, సహనం, సేవాభావం అనే గొప్ప విలువలను అందరికీ చాటి చెబుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, దైవ దీవెనలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.