దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు

"చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంగా పోలీసుల చర్యలు"

పయనించే సూర్యుడు మార్చి 25 రాజేష్) దౌల్తాబాద్, మార్చి 24: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న “చలో అసెంబ్లీ” కార్యక్రమం నేపథ్యంలో దౌల్తాబాద్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చే అవకాశముండటంతో పోలీసులు అప్రమత్తమై ముందస్తు చర్యలకు దిగారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బీఆర్ఎస్వి (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం)కి చెందిన పలువురు కీలక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం. పోలీసుల ప్రకారం, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ చర్యలు అవసరమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్వి నాయకుడు ఖలీలోద్దీన్ పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలని భావించామని, అయితే ముందస్తు అరెస్టులతో తమ హక్కులను అడ్డుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో దౌల్తాబాద్ మండలంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొనగా, “చలో అసెంబ్లీ” కార్యక్రమంపై మరింత ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *